శివధనుర్భంగము

చ.
కదలకుమీ ధరాతలమ కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు కూర్మమ రసాతలభోగిఢులీకులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీఫణికచ్ఛపపోత్రివర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులు భూవరుడీశుని చాపమెక్కిడున్.
సీతా స్వయంవర ఘట్టంలో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టటానికి ముందుగా లక్ష్మణుడు చేసిన హెచ్చరికను కవయిత్రి మొల్ల అద్భుతమైన పద్యంలో రచించినది.
లక్ష్మణుడు భూమిని భరించే అధినాయకుల ను ఒక్కొక్కరినీ పేరు పేరునా సంభోదిస్తూ- భూమి, ఆదిశేషువు, కూర్మము, వరాహము, అష్టదిగ్గజములనూ సావధానులై ఉండగలందులకు చేసిన హెచ్చరిక ఇది।
ఓ భూమీ! కదలకు! ఆదిశేషుడా! భూమిని గట్టిగా పట్టుకో।ఓ కూర్మమా! ఆదిశేషుడిని,భూమినీ వదలకుండా పట్టుకో। వరాహమా! కూర్మమును,ఆదిశేషుని,భూమినీ వదలకుండా గట్టిగా పట్టుకో।అష్టదిగ్గజములారా !మీరు ఆది వరాహమును, ఆది కూర్మమును, ఆదిశేషుని, భూమినీ కదలకుండా గట్టిగా పట్టుకొని ఉండండి।శ్రీరాముడు శివధనస్సుని ఎక్కుపెట్ట బోతున్నాడు। బహుపరాక్!
క।
ఉర్వీనందనకై రా
మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రుని చాపం
బుర్విం బట్టుడు దిగ్దం
త్యుర్వీధరకిటిఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్।

భూపుత్రిక సీత కొఱకు భూనాధుడైన శ్రీరాముడు ఇప్పుడు శివుని ధనువును ఎక్కుపెట్టుచున్నాడు।కావున అష్టదిగ్గజాలు,ఆదివరాహము,కూర్మము,ఆదిశేషువు భూమిని కదలకుండా గట్టిగా పట్టుకొనవలసినదని మరోసారి హెచ్చరిక చేస్తున్నట్లుగా మరొక చిన్న పద్యంలో మొల్ల చెప్పినది।
 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates