ఆంధ్ర భాష చరిత్ర, సంస్కృతుల సర్వతోముఖ అభివృద్ధికి సూచనలు

శ్రీ సరస్వత్యై నమః


తమిళభాషలో తొలికావ్యం 'తిరుక్కురళ్'ను రచించిన మొదటి తమిళకవి తిరువళ్ళువార్ జ్ఞాపకార్థము కన్యాకుమారి సమీపమున సముద్ర మధ్యమున వున్న 'వివేకానందరాక్'పై 130 అడుగుల ఎత్తుగల శిలావిగ్రహమును ప్రతిష్ఠించి, ప్రక్కనే ఒక హాలు నిర్మించి ఆ గోడలపై 'తిరుక్కురళ్' గ్రంధములోని విశేషములను తమిళ భాషలో చెక్కించి,-- ఈ నిర్మాణమునకు ఏడుకోట్ల రూపాయలు వ్యయపరచి-- తమ మాతృభాషాభిమానమును ప్రపంచమునకు చాటిచెప్పిన తమిళ సోదరులు ఎంతయు అభినందనీయులు.

ఇక ఫ్రకృతము:

1)ఆంధ్రభాషలో ఆదికావ్యము రచించిన ఆదికవి నన్నయ భట్టారకునకు, ఆ రచనకు మూలకారణమైన చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రునకు, రాజమహేంద్రవరంలో 65 అడుగుల ఎత్తుగల రెండు శిలావిగ్రహములను ప్రతిష్ఠించి, ప్రక్కనే అధునాతన సౌకర్యములతో 'రాజరాజ మందిరము' అను పేరున ఒక ఆడిటోరియంను నిర్మించుట మన ప్రథమ కర్తవ్యము.

2)నేడు కర్ణాటక రాష్ట్రములో వున్న 'హంపీ విజయనగర' శిధిలాల స్థలములో ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల సంస్మరణార్ధము 65 అడుగుల విగ్రహమును ప్రతిష్ఠించి,ప్రక్కనే 'భువనవిజయము' పేరుతో ఒక సభాప్రాంగణము నిర్మించి-- అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన్న, ధూర్జటి, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణకవి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్యగారి మల్లన ల నిలువెత్తు విగ్రహములు నిర్మింపజేయుట అత్యావశ్యకము.

3)1022లో రాజమహేంద్రవరములో రాజరాజ నరేంద్రునకు జరిగిన పట్టాభిషేకదినమును "వేంగీ" ఉత్సవముగను,1509లో హంపీ విజయనగరమున శ్రీకృష్ణదేవరాయలకు జరిగిన పట్టాభిషేకదినమును "హంపీ"ఉత్సవముగను మూడు రోజులపాటు జరిపించి ప్రాచీనాంధ్రవైభవమును గూర్చి బహుళవ్యాప్తి కలిగించుట ఆంధ్రులమైన మన అందరి కర్తవ్యము.

4)నేడు తమిళనాడులో వున్న తంజావూరు 'సరస్వతీమహల్' పుస్తక భాండాగారము తంజావూరును పాలించిన తెలుగు నాయకరాజుల, ఆంధ్రభాషాభిమానులైన మహారాష్ట్ర ప్రభువుల కృషి ఫలితము. కనుక ఆ గ్రంధాలయములోనున్న వివిధ భాషలలోని గ్రంధములు అన్నంటిని మైక్రోఫిల్ముల ద్వారా, ఆడియో వీడియో కేసెట్లద్వారా, కంప్యూటరు డిస్కులద్వారా సేకరించి మన రాష్ట్రమునకు తెచ్చుకొనుట అత్యంతావశ్యకము.

5)దక్షిణభారతదేశంలో భాషా,సంస్కృతుల అధ్యయన సంస్థలు కేంద్ర ప్రభుత్వంచే స్థాపించబడినవి,(1)నాగపూరు (2)తంజావూరులలో వుండగా రాష్ట్రప్రభుత్వం వారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక సంస్థను ఏర్పాటు చేసారు.వీటికి ఏఏ నిధులు ఎంతెంత వస్తున్నవో, ఏ విధంగా ఉపయోగపడుచున్నవో పరిశీలన జరిపి ఆయా కార్యక్రమములు విస్తృత పరచుట ఆవశ్యకము.

6)కేంద్ర ప్రభుత్వ అధీనంలో దేశభాషా సంస్కృతుల పరిరక్షణకు ఉన్న సంస్థలు:

౧) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
౨) కేంద్రసాహిత్య ఎకాడమీ, కేంద్ర సంగీత ఎకాడమీ, కేంద్ర నాటక ఎకాడమీ, కేంద్ర నాట్యకళా ఎకాడమీ.
౩)రాజీవ్ గాంధీ ఫౌండేషన్
౪)కల్చరల్ బెనిఫిట్ ఫండు.

ఈ సంస్థల నుండి ఏఏ నిధులు మన రాష్ట్రమునకు వచ్చు అవకాశమున్నదో పరిశీలించి తెచ్చుకొను ప్రయత్నము చేయవలయును.

7)న్యూఢిల్లీలో ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్, డాన్స్ సంస్థ వున్నది. దీని ప్రధాన కేంద్రము న్యూయార్క్ నగరంలో ఉన్నది.ఈ సంస్థలో అంతర్జాతీయ స్థాయికి చెందిన నర్తకీమణులు సోనాల్ మాన్సింగ్, మృణాళినీ సారాభాయి, యామినీకృష్ణమూర్తి వంటివారు డైరెక్టర్లుగా పనిచేసి భారతీయ సంగీతముపై భారతీయ నాట్యశాస్త్రముపై పరిశోధనలు జరిపి ఎన్నో గ్రంధములు రచించేరు.ఈ సంస్థకు ప్రపంచ దేశాలన్నిటి నుండి ధనసహాయము అందుచున్నది.మన రాష్ట్రములోని ప్రసిద్ధ కళాకారులకు ఈ సంస్థతో సంబంధము లేర్పరుచుట ఆవశ్యకము.

8)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వము వారిచే మూడు సంస్థలు నడుపబడుచున్నవి.
౧)రాష్ట్ర సాంస్కృతిక శాఖ (౨)రాష్ట్ర సాంస్కృతిక మండలి (౩)పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 1985లో ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు(1)ఆంధ్ర సాహిత్య పరిషత్ (2) ఆంధ్ర సంగీత పరిషత్ (3)ఆంధ్ర నాటక పరిషత్ (4) ఆంధ్ర నాట్యకళా పరిషత్ లను నాల్గింటిని రద్దుచేసి ఒకే సంస్థ ఆధిపత్యములో సమగ్రాభివృద్ధి సాధించుటకు తెలుగు విశ్వ విద్యాలయమును, లలిత కళా తోరణ ప్రాంగణమును ఏర్పాటు చేసినారు.ఈ లలిత కళల సర్వతోముఖాభివృద్ధికి సమన్వయ కమిటీలను ఏర్పరచుకుని, అవసరమైతే పై పరిషత్తులను పునర్నిర్మించుట ఆవశ్యకము.

9)ఆంధ్రప్రదేశలో ప్రస్తుతము పన్నెండు ప్రభుత్వ సంగీత కళాశాలలున్నవి.ఆ సంస్థలకు తగిన వనరులు ఎన్ని వున్నవో గమనించి విద్యార్థుల విద్యాప్రమాణములు పెంచుటకు తగిన చర్యలు తీసుకోవలసి యున్నది.రాష్ట్రములోని మిగిలిన జిల్లాలలో కూడా ఇట్టి సంగీత కళాశాలలు ఏర్పాటుచేసి ఆంధ్రులలో శాస్త్రీయ సంగీతమునకు బహుళ వ్యాప్తిని కలిగించి ఆంధ్రుల సాంస్కృతిక వైభవమునకు చేయూత నియ్యవలెను."త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు" తెలుగుపాటకు ప్రపంచ ఖ్యాతిని సమకూర్చిపెట్టినవి గనుక "మా తెలుగు తల్లికీ మల్లెపూదండ" అందించుట మనందరి బాధ్యత మరియు తక్షణ కర్తవ్యము.

10)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు తెలుగుకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి తెలుగుభాషాచరిత్ర, సంస్కృతుల సర్వతోముఖ, సత్వర అభివృద్ధికోరకు ఒక ప్రత్యేక మంత్రివర్యుని నియమించుట, అత్యంత ఆవశ్యకము.ఈ తెలుగు శాఖకు తగు సూచనలను, సలహాలను అందజేయుటకు వివిధ రంగాలలో విశిషకృషి సల్పిన ముప్పయిమంది సలహా సంఘ సభ్యులతో కూడిన "తెలుగుభాషాసమితి"అను పేరుతే ఒక బలీయమైన సంఘమును రూపొందించుటయు ఆవశ్యకము. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పట్టణము, మరియు ప్రతి గ్రామమునందును 'తెలుగుభాషాసమితి' సంఘములను ఏర్పరచి తెలుగుభాష ఔన్నత్యానికి బహుళ వ్యాప్తిని కలిగించుట ఎంతైనా ఆవశ్యకము.

11)మన ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయభాష, పరిపాలనాభాష, వ్యవహారికభాషగా యున్న తెలుగుభాషను ఒక ప్రామాణిక భాషగా అభివృద్ధిని చేకూర్చి ప్రాచీన కాలమునాటి రాజరాజ నరేంద్రుని, కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలోవలే ఉన్నత స్థితిని కలిగించుట మనందరి తక్షణ కర్తవ్యము.

12)మన మాతృభాష ఎంతో అందమైన భాష.తెలుగు అక్షరములు గుండ్రముగా వుండుటచేత, అచ్చులో చూచినా, వ్రాసినా అందముగా కనబడును.తెలుగు అక్షరములు అజంతములగుటచేత వినుటకు సొంపుగా వుండును. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా కన్నతల్లి వంటి మన తెలుగును అభిమానించి,ఆదరించి మన మాతృభాషాభివృద్ధికి ఆంధ్రులెల్లరూ తోడ్పడుదురుగాక!
మనమందరం తెలుగులోనే ఆలోచిద్దాం.తెలుగులోనే మాట్లాడుకుందాం.

శ్రీకాకుళం సదా తెలుగుతల్లి సేవలో
11-11-2008 ---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

2 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఉత్పలమాల:-
వేదుల వంశ సంభవ! సువేద్యమయెన్. భవదీయ భావముల్.
మీదగు సూచనాళి ని సమీక్షకు పెట్టి ప్రభుత్వమిప్పుడే
వాదుగ నాంధ్రమాతకు నవారిత భావి సముజ్వలమ్ముకై
యౌదల దాల్చి చేసిన మహాద్భుత జ్ఞాన ప్రపత్తి కాననౌన్.
{ఆంధ్రామృతం}

అజ్ఞాత చెప్పారు...

Mee Blaagu Baagundi.

http://www.varudhini.blogspot.com

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates